న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం అందుకుంది. అటు ఓటీటీలోనూ ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. కాగా ఓటీటీ ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతుండడంతో ఈ మూవీ పై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
అసలు , పరుచూరి ఏం అన్నారంటే.. ‘భారీ బడ్జెట్తో చిత్రాలను తెరకెక్కించడం కంటే.. తక్కువ బడ్జెట్లోనైనా మంచి పాయింట్ను చెప్పి విజయం అందుకోవచ్చని ఈ మూవీ డైరెక్టర్, రచయితలు, నిర్మాతలు రుజువు చేసి చూపించారని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథలో కుర్రాడికి ఎంతో భవిష్యత్తు ఉందంటూ సినిమాని మొదలు పెట్టి.. అతడి భవిష్యత్తును శూన్యం చేసే ప్రయత్నంలో స్క్రీన్ప్లే నడిపించారు. అదే విధంగా వయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయి 16 నిమిషాలపాటు రూమ్లో ఏం చేసి ఉంటారు ? అనే విషయాన్ని ముందే రివీల్ చేయకుండా ఆసక్తి రేకెత్తించారు.
న్యాయమూర్తికి జరిగిందంతా చందు చెప్పేముందు లాయర్లు మినహా మిలిగిన వారిని బయటకు పంపించే సన్నివేశం బాగుంది. మైనర్ల కేసుల్లో అలా చేస్తారనేది ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ చూడలేదు..చూపించలేదు కూడా. క్లైమాక్స్కు నేను చప్పట్లు కొట్టా. హీరో- హీరోయిన్లు బాగా చదువుకుని, గొప్పవారై, పెళ్లి చేసుకున్నట్టు ఓ సీన్ చూపించే ఉంటే బాగుండేది’ అని ఆయన చెప్పారు.