వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో కొత్త లిక్కర్ పాలసీ ముసుగులో ఏకగా 3500 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు దిగమింగిన కేసు ఇప్పుడు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇన్నాళ్లూ ఎందరిని నిందితులుగా చేర్చినా, ఎందరిని అరెస్టు చేసి విచారించినా.. అంతిమ లబ్ధి పొందిన బిగ్ బాస్ ఎవరనేది మాత్రం స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఈలోగా బిగ్ బాస్ తోపాటు బిగ్ మేడం పాత్ర కూడా ఉన్నదేమోననే అనుమానాలు విచారణ సాగుతుండగా.. ప్రజల్లో ఏర్పడుతున్నాయి.
కొత్త లిక్కర్ పాలసీ ముసుగులో పెంచిన ధరలన్నీ ఒక మాయ. ఆ పెంచిన వ్యత్యాసాన్ని డిస్టిలరీలనుంచి ముడుపులుగా తీసుకుంటూ.. అలా ఆ మొత్తం చెల్లించిన డిస్టిలరీలకు మాత్రమే మద్యం సరఫరా ఆర్డర్లు పెడుతూ.. జగన్ సర్కారు చాలా పకడ్బందీ దందా నడిపించింది. డిస్టిలరీలనుంచి దొడ్డిదారిన వాటాలను వసూలు చేసే పనిని కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి తాను సొంతంగా ఏర్పాటుచేసుకున్న నెట్ వర్క్ ద్వారా.. వసూళ్లు సాగించారు. ఆ మొత్తాలను వైసీపీ పెద్దలకు అందజేశారు. నెలవారీగా సుమారు 50-60 కోట్ల రూపాయలు వసూలు చేసి, అప్పట్లో సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిలతోపాటు, భారతి సిమెంట్స్ లో పూర్తికాల డైరక్టరుగా ఉన్న గోవిందప్ప బాలాజీకి కూడా అందజేసేవారని.. కెసిరెడ్డి విచారణలో చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
తొలిదశలో కేవలం ఏ1 నిందితుడిగా, బివరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సయిజ్ అధికారి సత్యప్రసాద్ తదితరులు నిందితులుగా ఉండగా.. ఆ తర్వాతి దశలో రాజ్ కెసిరెడ్డి అనుచరగణాలూ.. ఎంపీ మిథున్ రెడ్డీ, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అందరూ నిందితులుగా మారారు. కానీ.. కెసిరెడ్డినుంచి ముడుపులు స్వయంగా పుచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చిన వారు మాత్రం తాజాగా నిందితుల జాబితాలో చేరారు.
ఈ ముగ్గురిలో వైఎస్ భారతికి అత్యంత విధేయుడిగా, విశ్వసనీయుడిగా పేరున్న గోవిందప్ప బాలాజీ వ్యవహారం చాలా చిత్రంగా కనిపిస్తోంది. ఆయన తరఫు న్యాయవాదులు అసలు ఆయనపై కేసు నమోదు చేయడమే కుదరదని వాదనలు వినిపిస్తున్నారు.
గోవిందప్ప బాలాజీ ఒక ప్రెవేటు వ్యక్తి గనుక, ఆయన ప్రభుత్వంలో భాగం కాదు గనుక, ఒక ప్రెవేటు కంపెనీలో డైరక్టరుగనుక.. ఆయన మీద కేసు పెట్టరాదని అంటున్నారు. ఒక అవినీతి దందా జరిగిన తర్వాత.. అందులో ప్రెవేటు వ్యక్తుల ప్రమేయం ఉండజాలదని, ప్రెవేటు వ్యక్తులపై కేసు పెట్టరాదని ఏ రాజ్యాంగంలో ఉన్నదో తెలియదు. ఆ మాటకొస్తే.. వసూళ్ల నెట్వర్క్ నడిపించిన రాజ్ కెసిరెడ్డి ప్రభుత్వ సలహాదారు పాత్రలో ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పనిచేసిన ఆయన నెట్వర్క్ మొత్తం ప్రెవేటు వ్యక్తులే. అయినా ప్రెవేటు వ్యక్తి గనుక.. కేసు కొట్టేయాలని కోరడంలో ఏం లాజిక్ ఉన్నదో సామాన్యులకు అర్థం కావడం లేదు. గోవిందప్ప బాలాజీ ఇప్పుడు 33వ నిందితుడిగా ఉన్నారు. ఆయనను కూడా పోలీసులు అరెస్టుచేసి విచారిస్తే.. తెరవెనుక ఉన్న బిగ్ మేడం పాత్ర కూడా బయటకు వస్తుందని అంతా అనుకుంటున్నారు.
ఇదేం వింత పితలాటకం గోవిందప్పా..?
Wednesday, May 14, 2025
