తమ వ్యవహారం పోలీసుల దాకా వస్తే చాలు.. రాజకీయ నాయకులకు ఎక్కడలేని జబ్బులు వస్తాయి. విచారణకు హాజరు కాలేని రోగాలు వస్తాయి. తమ మీద కేసులు నమోదు అవుతున్నాయనే సంకేతాలు రాగానే.. రోగాలు తెచ్చుకుని ఆస్పత్రుల్లో చేరిపోయే మేధావులు మనకు అనేకులు కనిపిస్తుంటారు. ఆస్పత్రిల్లో ఇన్ పేషెంటుగా ఎడ్మిట్ అవుతారు.. అవసరమైతే సర్జరీలు చేయించుకుంటారు.. పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ పేరుతో కొన్ని సంవత్సరాలు సాగదీయవచ్చునని.. పోలీసుల విచారణకు వెళ్లకుండా రోజులు నెట్టవచ్చునని భ్రమపడుతూ ఉంటారు. రాజకీయ నాయకులకు ఇలాంటి కుయుక్తులు, కుట్ర ఆలోచనలు షరా మామూలే! కానీ.. ఇదే తరహా మాటలు ఒక ఇతర సంస్థల ఉద్యోగినుంచి కూడా వస్తే ఏమనుకోవాలి? దాల్ మే కుఛ్ కాలా హై అని అనుకోవాల్సిందే కదా! ‘ఓసారి స్టేషను దాకా వచ్చి, ఫలానా రోజున ఏం జరిగిందో నీ నోటితో చెప్పేసి వెళ్లుబాబూ’ అని పోలీసులు పిలిస్తే.. ‘నాకు ఆరోగ్యం బాగాలేదు’ అనే సాకు చూపించి వారాలు గడిపేసే వాడిని ఏం అనుకోవాలి. తరచూ కలిసి తిరగడం వల్ల రాజకీయ నాయకులు బుద్ధులే అతనికి అబ్బాయని అనుకోవాల్సిందే తప్ప ఇంకో ఆలోచన స్ఫురించదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయిజిల్లా పాపిరెడ్డి పల్లెను సందర్శించినప్పుడు.. రామగిరి హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటనల క్రమం గురించి వివరాలు తెలుసుకోవడానికి హెలికాప్టర్ పైలట్ కు పోలీసులు నోటీసులు ఇస్తే.. ఆయన మొహం చాటేయడానికి చేస్తున్న ప్రయత్నాలు రకరకాల అనుమానాలు పుట్టిస్తున్నాయి. జగన్ పాపిరెడ్డి పల్లె వెళ్లినప్పుడు రామగిరి వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు అయింది. పార్టీ కార్యకర్తలంతా ఊళ్లో కార్యక్రమం వద్దకే రావాలి తప్ప.. హెలిప్యాడ్ వద్దకు రావొద్దని, భద్రత కారణాల దృష్ట్యా ఇది చాలా ముఖ్యమని పోలీసు అధికారులు రోజుల ముందునుంచి పార్టీ నాయకులకు తెలియజెప్పారు. కానీ.. పోలీసు సూచనలను ఉల్లంఘించడమే తమ లక్ష్యం అన్నట్టుగా.. నాయకులు ప్రత్యేకంగా జనాన్ని హెలిప్యాడ్ వద్దకు తోలించారు. అక్కడ తోపులాట జరిగింది. జనం హెలికాప్టర్ మీదికి ఎగబడడంతో విండ్ షీల్డ్ కొద్దిగా పగులు వచ్చి దెబ్బతింది.
జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి ప్రభుత్వం కుట్ర చేసిందని, అందుకే అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు పట్టించుకోలేదని, వైసీపీ వారు కుటిల ప్రచారం ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. హెలికాప్టర్ దెబ్బతిన్నదని సాకు చూపించి.. జగన్ రోడ్డు మార్గంలో బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. అలా వెళ్లేలా పరిస్థితి సృష్టించి రోడ్డు మార్గంలో చంపేయాలని తెలుగుదేశం కుట్ర చేసిందని కూడా అన్నారు.
ఆయన వాహనాలు వెళ్లినకాసేపటికి హెలికాప్టర్ ఎంచక్కా గాల్లోకి ఎగిరి బెంగుళూరు వెళ్లిపోయింది. జగన్ ను ఎక్కించుకోవడానికి నిరాకరించి, విండ్ షీల్డ్ దెబ్బతిన్నదని సాకు చెప్పిన హెలికాప్టర్ సిబ్బంది తాము మాత్రం ఎలా వెళ్లారనేది ప్రశ్న. ఈ విషయం తేల్చుకోవడానికి, అలాగే.. విండ్ షీల్డ్ ఎలా దెబ్బతిన్నదో, ఆ రోజు అక్కడ జరిగిన సంఘటనల క్రమం ఏమిటో విచారించడానికి పైలట్ , కోపైలట్ లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోపైలట్ న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చి వెళ్లిపోయారు. కానీ పైలట్ రాలేదు. మే 1,2 తేదీల్లో రావాలని రెండోసారి నోటీసులు పంపగా.. ఆరోగ్యం బాగా లేదని.. వీలైతే జూన్ లో వస్తానని ఆయన సమాచారం పంపారు. అప్పుడు వచ్చి.. ఆరోజు ఏం జరిగిందో తనకు గుర్తులేదని చెప్తారన్నమాట. అయితే హెలికాప్టర్ పైలట్ కూడా ఇలాంటి డొంకతిరుగుడు సమాధానాలు చెబుతుండడం గమనిస్తే.. అతడిని కూడా వైసీపీ నాయకులే కీ ఇచ్చి నడిపిస్తున్నారని అర్థమవుతోంది. అందుకే అసలు హెలికాప్టర్ దెబ్బతింది అనే ఆరోపణల మీదనే ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి.
అతను కూడా వేషాలేస్తే అనుమానించాల్సిందే!
Wednesday, May 14, 2025
