‘నేను అడిగినంత ముడుపులు నాకు చెల్లించుకోకుంటే.. నా నియోజకవర్గంలో మీరు వ్యాపారం చేసుకోలేరు..’ అని బెదిరించి.. స్టోన్ క్రషర్స్ యజమానులనుంచి రెండు కోట్ల రూపాయల ముడుపులను స్వీకరించిన కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి విడదల రజని.. హఠాత్తుగా సీఐడీ కార్యాలయం ఎదుట కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అజ్ఞాతంలోకి పారిపోవడం అనేది జరగలేదు గానీ.. విడదల రజని కొన్నాళ్లుగా బాహ్యప్రపంచంలో ఎవ్వరికీ కనిపించడం లేదు. తన మీద నమోదు అయిన అవినీతి కేసులో.. వసూళ్ల కేంద్రంగా తన తరఫున పనిచేసిన సొంత మరిది విడదల గోపీ ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. పోలీసుల విచారణలో ఈ లంచాల బాగోతం రహస్యాలన్నీ ఆయన పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. హైకోర్టు బెయిలు కూడా నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తుల్లో తనకు పార్టీ నాయకుల అండ అవసరం అవుతుందనే ఆలోచనతోనే విదదల రజని సీఐడీ కార్యాలయం వద్దకు.. తన పార్టీ నాయకుల వెంట కనిపించడానికి వచ్చినట్టుగా పలువురు భావిస్తున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి సిఐడి విచారణకు పిలిచినప్పుడు ఆయన వెంట అనేకమంది నాయకులు గుంపులుగా కార్యాలయానికి వచ్చారు. ఆ బృందంలో విడుదల రజని కూడా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. చాలా కాలం తర్వాత ఆమె బాహ్య ప్రపంచంలో కనిపించారని ప్రజలు అనుకున్నారు.
విడదల రజిని ఎమ్మెల్యే అయిన తర్వాత చిలకలూరిపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా దందాలు ప్రారంభించారు. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను తన వద్దకు పిలిపించుకుని ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే తన నియోజకవర్గంలో వ్యాపారం చేసుకోలేరు అంటూ బెదిరించారు. అధికారులతో తనిఖీలు చేయించి మేడం చెప్పినట్లు వినకపోతే 50 కోట్ల జరిమానా వేయిస్తాం అంటూ హెచ్చరించారు. మొత్తానికి స్టోన్ క్రషర్స్ యజమానులు అమిత బేరం కుదుర్చుకుని రెండు కోట్ల రూపాయలను ఆమె మరిది విడుదల గోపి ఇంటికి చేర్చడం జరిగింది. ఆ కేసులో గోపి ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మాజీ మంత్రి విడదల రజని హైకోర్టును ఆశ్రయించి.. ప్రస్తుతానికి అరెస్టు నుంచి రక్షణ పొంది ఉన్నారు. ముందస్తు బయలు కోసం ప్రయత్నిస్తున్నారు గాని అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అరెస్టు నుంచి రక్షణ ఉన్నది కనుక ఆమె పాహి ప్రవచనంలోకి రావచ్చు. కానీ ఇన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన ఆమె సజ్జల రామకృష్ణారెడ్డి ని సిఐడి విచారణకు పిలిచిన సందర్భంలో మాత్రం ఆయన వెంట వచ్చారు. పార్టీలో జగన్ కంటే శక్తిమంతులైన నాయకుడిగా చక్రం తిప్పే సజ్జల రామకృష్ణారెడ్డి గుడ్ లుక్స్ లో ఉంటే.. భవిష్యత్తులో తన అవినీతి కేసులో అనుకోని పరిణామాలు ఎదురైనా కూడా పార్టీ తనకు అండగా ఉంటుందని ఆమె ఆశపడుతున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.
అయితే విడదల గోపి ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి పోలీసులు త్వరలోనే మాజీ మంత్రి రజినీకి కూడా విచారణ నిమిత్తం రావాల్సిందిగా నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. గోపి నుంచి 2.2 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు నివేదించిన నేపథ్యంలో.. ఆ కేసులో అంతిమ లబ్ధిదారు రజని గనుక రికవరీ కూడా ఆమె నుంచే జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ కేసు అక్కడిదాకా వచ్చినప్పుడు పార్టీ ఆమెకు ఎంత మద్దతుగా నిలుస్తుందో చూడాలి.అరెస్టు నుంచి రక్షణ అనే కవచం ఉన్నందువల్ల రజని అనుభవిస్తున్న స్వేచ్చ ఇంకెంత కాలం ఉంటుందో అని ప్రజలు అనుకుంటున్నారు.
విడదల రజని ఈ స్వేచ్ఛను ఇంకెన్నాళ్లు అనుభవిస్తారో..?
Wednesday, May 14, 2025
