దాదాపు 3500 కోట్ల రూపాయలకుపైగా అధికార పార్టీలోని పెద్దలందరూ కలిసి కాజేసిన అతిపెద్ద కుంభకోణం అది. అంత సొమ్మును ఎలా వసూలు చేశారు? ఎలా చేతులు మార్చారు? ఏయే మార్గాల్లోకి మళ్లించారు? ఇవన్నీ కూడా ఇంకా సస్పెన్స్ గా ఉన్న విషయాలే. ఎలా వసూలు చేశారనే సంగతి మాత్రం.. కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి పుణ్యమాని వివరంగా బయటకు వచ్చింది. కానీ.. అంతిమలబ్ధిదారులు ఎవరు? ఎలా చేతులు మార్చారు? ఏయే రూపాల్లోకి మార్చారు? అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. ఇప్పుడు ఈ వ్యవహారంలోకి కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఈడీ దృష్టి పెట్టింది. స్వయంగా తాము రంగంలోకి దిగి.. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయాలని ఈడీ భావిస్తోంది. వేల కోట్ల రూపాయల అక్రమ మార్గాల్లో దేశం దాటించారనే ప్రచారం కూడా బాగా జరగడంతో ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. క్వాసీ జుడిషియరీ అధికారాలు ఉండే ఈడీ స్వయంగా పూనుకుంటున్న నేపథ్యంలో.. లిక్కర్ స్కాం దొంగల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మద్యం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందించాల్సిందిగా.. సిట్ చీఫ్ ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్ ను ఈడీ కోరింది. ఈ మేరకు వారికి లేఖ రాశారు. 2002 నాటి మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తామని ఆ లేఖలో వివరించారు.
ఈ కేసులో ఇప్పటిదాకా గుర్తించిన నిందితుల బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు సమస్తం తమకు అందించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కోరడం విశేషం. ఈడీ రంగంలోకి దిగితే.. కేసు పురోగతి పూర్తిగా ఇంకో లెవెల్లో ఉంటుందని పలువురు అంటున్నారు.
లిక్కర్ స్కామ్ గురించి కొన్ని నెలల కిందట తెలుగుదేశం పార్టీ లోక్ సభా పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు.. ఇందులో వసూళ్లు చేసిన వేల కోట్ల రూపాయలు హవాలా మార్గాల్లో దేశం దాటినట్టుగా వెల్లడించారు. ఏయే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడుల ముసుగులో ఎన్నెన్ని వందల కోట్లు చేతులుమారాయో ఆయన గణాంకాల సహా చెప్పారు. ఆ మరుసటి రోజున కేంద్ర హోం మంత్రి స్వయంగా కృష్ణదేవరాయలును పిలపించుకుని.. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పూర్తివివరాలు అడిగి తెలుసుకున్నారు కూడా.
ఈ నరసరావు పేట ఎంపీ తన వద్ద ఉన్న పూర్తి వివరాలను ఆయనకు అందించడంతో పాటు.. ఈడీని రంగంలోకి దించాల్సిందిగా అమిత్ షాను కోరారు కూడా. మరోవైపు సమాంతరంగా సిట్ దర్యాప్తు సాగుతూ వచ్చింది. కీలక నిందితులు ముందస్తు బెయిళ్ల కోసం సుప్రీం కోర్టునుకూడా ఆశ్రయిస్తుండడం.. దేశంలో సంచలనం రేగుతున్న సమయంలో.. ఈడీ స్వయంగా రంగంలోకి దిగడం ఆసక్తికరంగా ఉంది.