సుప్రీంలో చుక్కెదురు .. అవినాష్ బెయిల్ ర‌ద్దు, విచారణ గడువు పెంపు

Friday, April 19, 2024

వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.. హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర బెయిల్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేసింది.. వివేకా హ‌త్య కేసులో హైకోర్టు అవినాష్ రెడ్డికి ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డంపై వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.. దీనిపై ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
మరోవంక, ఈ నెలాఖరు నాటికి కేసు విచారణను పూర్తి చేయాలని గతంలో ఆదేశించిన సుప్రీంకోర్టు తాజాగా సీబీఐ అభ్యర్థన మేరకు ఈ కేసు విచారణ కోసం జూన్ 30 వరకు గడువు పొడిగించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సమంజసంగా లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అవినాష్ రెడ్డికి లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలన్న ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు ఆదేశాలు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంది.

ఇక ముందస్తు బెయిల్ అంశంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు బెయిల్‌పై తేల్చేంతవరకు అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.

అయితే అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరెందుకు ఊహిస్తున్నారని ప్రశ్నించింది. సీబీఐ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో చేసి ఉండేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సీబీఐ పూర్తి సంయనంతో ఉందని పేర్కొంది.

మరోవైపు ఈ కేసులో సీబీఐ ఈమధ్య అరెస్టు చేసిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి నుంచి ఐదు రోజుల పాటూ సీబీఐ కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వీరిని సీబీఐ.. ఏరోజుకారోజు కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. విచారణ మొత్తాన్నీ ఆడియో, వీడియో రికార్డ్ చేస్తోంది. నేటితో వీరి విచారణ ముగియనుంది.

తొలుత, ముందస్తు బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకుంటే మంచిదని ఎంపి అవినాష్ రెడ్డికి సిజెఐ సూచించింది. వివేకా హత్య తరువాత సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఎంపి అవినాశ్ రెడ్డి ప్రయత్నం చేశాడని సిద్ధార్థ లూత్ర కోర్టులో వాదనలు వినిపించారు. సిఐ శంకరయ్య తన వాంగ్మూలంలో అదే చెప్పారని సునీత లాయర్ పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డికి ప్రశ్నలు ముందే ఇవ్వాలని హైకోర్టుకు చెప్పిందని, ఇలా ఎప్పుడు జరగలేదని సునీత లాయర్ వెల్లడించారు.

హైకోర్టు అలా చెప్పలేదని, హైకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని అవినాశ్ రెడ్డి తరపు లాయర్ముకుల్ రోహత్గి వాదించారు. వివేకా మర్డర్ కేసులో సిబిఐ క్లియర్‌గా అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని చెప్పారని సునీత లాయర్ గుర్తు చేశారు.
 హైకోర్టు ప్రాధమిక స్థాయిలో ఎలా జోక్యం చేసుకుంటుందని సిజెఐ ప్రశ్నించింది. సిబిఐ పని కూడా హైకోర్టు చేస్తే ఎలా అని సిజెఐ డివై చంద్రచూడ్ అడిగారు. ఈ కేసులో మాత్రమే హైకోర్టు ఎందుకు ఇలా వ్యవహరించిందని అడిగింది. ప్రశ్నోత్తరాల ప్రింటెంట్ పార్మాట్‌లో ఇవ్వాలని హైకోర్టు ఎలా చెబుతోందని సిజెఐ ప్రశ్నించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles