సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్తగా సోమేశ్ కుమార్!

Friday, March 29, 2024

మహారాష్ట్రకు చెందిన శరద్‌ మన్కడ్‌కు ముఖ్యమంత్రి ప్రైవేటు సెక్రటరీగా నియమించిన కేసీఆర్ వారం రోజులకే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను   తన ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ శాంతి కుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమేష్ కుమార్ ప్రభుత్వ సలహాదారు పోస్టులో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. 

ఈ రెండు నియామకాలు కూడా ప్రభుత్వంకు సేవలు అందించడానికి కాకుండా 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ కార్యకలాపాలను పర్యవేక్షించడం కోసం జరిగిన్నట్లు కనిపిస్తుంది. 

ప్రభుత్వ ఉద్యోగం వదిలి బిఆర్ఎస్ లో చేరిన శరద్‌ మన్కడ్‌ను తన ప్రైవేట్ కార్యదర్శిగా నియమించుకున్న కేసీఆర్, క్యాడర్ వివాదంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకొని పొరుగు రాష్ట్రం ఏపీలో రిపోర్ట్ చేయాల్సి రావడంతో ఐఏఎస్ కె రాజీనామా చేసిన సోమేశ్ కుమార్ కు కేబినెట్ హోదా కల్పించడం గమనార్హం.

ప్రభుత్వ సర్వీసు నుంచి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత సోమేష్ కుమార్ బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం కూడా జరిగింది.  బీహార్ లో పార్టీ విస్తరణకు పనిచేస్తారని, లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే, ఇప్పుడు కేబినెట్ హోదాతో ప్రత్యేక కార్యదర్శిగా నియమించడం ద్వారా బిఆర్ఎస్ వ్యవహారాలలో ఆయన కీలక పాత్ర పోషింపబోతున్నట్లు స్పష్టం అవుతుంది.

సోమేష్ కుమార్ కి బిహార్ లోని రాజ‌కీయ‌లపై మంచి ప‌ట్టు ఉంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. అటు దేశ రాజకీయాలపై కూడా పూర్తిస్థాయి అవగాహన ఉంది. స‌ర్వేల ఇన్ పుట్స్  సోమేష్ కుమారమే ఎప్పటికప్పుడు కేసీఆర్ కి చెబుతుంటారని అంటుంటారు. 

 ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సోమేష్ కుమార్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు రూపొందించడంలో, అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ కు చేదోడుగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ శర్మ నుండి 12 మంది సలహాదారులో ఉన్నారు. వారెవ్వరూ ప్రభుత్వానికి లేదా కేసీఆర్ కు ఎటువంటి సలహాలు ఇస్తున్నట్లు కనిపించదు. అసలు కేసీఆర్ కు సలహాలు ఇచ్చేవారంటే నచ్చదని అంటుంటారు. అటువంటి వారిని దగ్గరకు రానివ్వరని కూడా ప్రచారం జరుగుతుంది. కేవలం ఆయనకు అవసరమైన పనులను చక్కబెట్టే వారు మాత్రమే కావాలి.

ఆ విధంగా చేయడంలో సోమేశ్ కుమార్  సిద్ధహస్తుడు కావడంతో ఆయనకు మొదటినుండి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తున్నది. కేసీఆర్ కు ఏ పని అవసరమైనా ముందు, వెనుక చూడకుండా చేసేస్తుంటాడని ప్రతీతి. ఆ విధంగా చేయడానికి మిగిలిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొంచెం వెనుకాడుతుంటారు.  కేసీఆర్ కు ఆ విధంగా సేవలు చేస్తుండటం ద్వారా తన సొంత ప్రయోజనాలను సోమేశ్ కుమార్ నెరవేర్చుకున్నాడనే పేరుంది.

ఇటీవల మహారాష్ట్రలో ఇటీవల సీఎం కెసిఆర్ తో కలిసి ఔరంగాబాద్ లో బిఆర్ఎస్ సభలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. బిహార్‌కు చెందిన ఆయన 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించినా సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే క్యాట్‌ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేయడంతో హైకోర్టు ఆయనను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరో అవకాశం లేకపోవడంతో 2023 ఫిబ్రవరిలో ఆయన ఏపీ జీఏడీలో రిపోర్టు చేశారు. ఆ వెంటనే హైదరాబాద్‌కు వచ్చారు.

ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, మరో రాష్ట్రంలో అంతకంటే తక్కువ పోస్టులో పని చేయడానికి సోమేశ్‌ ఇష్టపడలేదు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles