ఫోన్లతో ఈడీ ముందు కవిత అడ్డంగా దొరికిపోయారా!

Thursday, April 18, 2024

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మూడోసారి మంగళవారం విచారిస్తుండగా, ఆమె అందచేసిన సెల్ ఫోన్లతో అడ్డంగా దొరికిపోయారా అనే అభిప్రాయం కలుగుతుంది.కవిత 10  సెల్ ఫోన్లను ధ్వంసం లేదా మార్చినట్లుగా ఈడీ అధికారులు అభియోగాలు మోపగా మంగళవారం ఈడీ విచారణకు వెళ్తున్న సందర్భంలో తాను గతంలో వాడిన మొబైల్ ఫోన్లను కూడా తీసుకెళ్లారు.

రెండు కవర్లలో మొబైల్స్ ను మీడియా ప్రతినిధులకు విజయహాసంతో  చూపించ కారెక్కారు. ఈడీ కార్యాలయానికి చేరుకుని కారు దిగిన తర్వాత కూడా మరోసారి తాను గతంలో వాడిన ఫోన్లు మీడియా ప్రతినిధులకు చూపించారు. ఈడీ విచారణ ముఖ్యంగా ఈ ఫోన్ల చుట్టే జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ వ్యవహారంలో ఆధారాలను మాయం చేసేందుకు కవిత ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో ఫోన్లను ధ్వంసం చేయలేదని సందేశాన్నిస్తూ కవిత పాత ఫోన్లు ప్రదర్శించారు.

అంతేకాదు, ఈడీపై నిందలు వేస్తూ ఆమెను విచారిస్తున్న  ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్‌కు అందిస్తున్న లేఖను కూడా ఆమె మీడియాకు విడుదల చేశారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తోందని, దురుద్దేశంతో వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. అందుకే తన పాత ఫోన్లన్నీ ఇచ్చేస్తున్నానని పేర్కొన్నారు.

 నవంబర్​ లోనే తాను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ప్రచారం చేసిందని,  ఏ ఉద్దేశంతో ఇలా చేశారని కవిత ఈడీని ప్రశ్నించారు. మహిళల ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అంటే స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని ఆమె ఆరోపించారు. ఫోన్ల విషయంలో కనీసం సమన్లు కూడా ఇవ్వలేదని కవిత తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను విచారణకు సహకరిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే విచారణకు వచ్చే ముందు ఆమె చూపించిన ఫోన్ల మీద బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కవిత చూపించిన ఫోన్లు పాతవి కాదు.. కొత్తవి అని ఆరోపిస్తున్నారు. కవిత ఫోన్లు చూపించిన సమయంలోని ఫొటోలు, వీడియోలను బీజేపీ నేతలు జూమ్ చేసి చూశారు. వాటికి ఉన్న ఐఎంఈఐ నెంబర్లను చూపించి  ఫోన్లు ఎప్పుడు కొన్నారని ప్రశ్నిస్తున్నారు.

ఒక ఫోన్ ఐ ఫోన్ ప్రో ఐఎంఈఐ నెంబర్ గా గుర్తించారు. ఈ ఫొన్ లాంచ్ అయింది 2022 సెప్టెంబర్ లో అని.. కొన్నది అక్టోబర్ లో అని.. ఈ ఫోన్ ఎవిడెన్స్ గా ఎలా ఇస్తున్నారని బిజెపి నేతలు ఆమెను నిలదీస్తున్నారు. 

లిక్కర్ పాలసీ ఆరోపణలు వచ్చాక గత ఏడాది జులైలో ఈ కుంభకోణం వెలుగులోకి రాగా, ఆ తర్వాత సెప్టెంబర్ లో కొన్న ఫోన్లను  ఈడీకి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కవిత ఎవరిని ఫూల్ చేయాలని అనుకుంటున్నారని అడుగుతున్నారు. ఇంత తక్కువ కాలంలో అన్ని ఫోన్లను మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  36 మందిని నిందితులు, అనుమానితులుగా గుర్తించిన ఈడీ…వారంతా 170 ఫోన్లు వాడినట్టుగా తెలిపారు.  ఇప్పటివరకు  కేవలం 17 ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఫోన్ల ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. ప్రధానంగా ఈడీ అధికారులు కవితను ఫోన్ల చుట్టే ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles