పోలవరం ప్రాజెక్ట్ ను గాలికి వదిలేస్తున్న జగన్, కేంద్రం

Friday, April 19, 2024

ఆంధ్రులకు వరప్రసాదంగా భావించే పోలవరం ప్రాజెక్ట్ ను అటు కేంద్రంలోని  నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలివేసినట్లు స్పష్టం అవుతుంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చేసరికే 70 శాతంకు పైగా పూర్తయిన ప్రాజెక్ట్ ఆ తర్వాత కుంటినడక నడుస్తున్నది. సవరించిన అంచనా ప్రకారం మార్చ్, 2024 లోగా పూర్తి కావలసి ఉన్నప్పటికీ అటువంటి అవకాశాలు కనిపించడం లేదు.

సవరించిన అంచనా వ్యయం రూ.35,490 కోట్లకు సంబంధించిన డీపీఆర్‌ ప్రతిపాదనలు కనిపించడం లేదని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొనడం కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో వెల్లడి అవుతుంది. మరోవంక, అధికారంలోకి రాగానే హడావుడిగా కాంట్రాక్టర్ ను వైఎస్ జగన్ ప్రభుత్వం మార్చిన కారణంగానే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం లేదని కేంద్రం స్పష్టం చేస్తున్నది.

క్ష్యం మేరకు ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయలేకపోవడానికి ప్రధాన కారణం 2019లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థను తొలగించి కొత్త సంస్థకు అప్పగించడమేనని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. కొత్త సంస్థకు హెడ్‌వర్క్స్‌ పనులు అప్పగించిన సమయంలో వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేయలేదని తెలిపింది.

అదీగాక, ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన భూసేకరణ పనులను చేపట్టడంలో రాష్ట్రప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని ఆక్షేపించింది. పోలవరం నిర్మాణ స్థితిగతులు, నిధులు విడుదల, అంచనాల ఆమోదం తదితర అంశాలపై సమాచార హక్కు చట్టం కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ కోరిన సమాచారం మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఈ వివరాలను వెల్లడించింది.

అదీగాక, డిజైన్లకు కేంద్ర జల సంఘం ఆమోదం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం లేదని, ఆమోదం పొందాక వాస్తవ డిజైన్లను అతిక్రమించిందని కేంద్రం తెలిపింది. మరోవంక, పోలవరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణం రూ.10,650.15 కోట్లకు సంబంధించి కేంద్రం ఎలాంటి బిల్లులూ సమర్పించలేదని నాబార్డు వెల్లడించింది. అలాగే పోలవరం కోసం రుణం కావాలంటూ తమకు కొత్తగా ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని కూడా తెలిపింది.

అంటే, అంచనాల మేరకు కేంద్రం నిధులు ఇవ్వకపోగా, నాబార్డ్ నుండి ఇప్పిస్తున్న రుణాల పట్ల కూడా ఆసక్తి కనబరచడం లేదు. అదే సమయంలో రాష్త్ర ప్రభుత్వం సహితం ఈ ప్రాజెక్ట్ ను పూర్తిచేయాలనే ఆసక్తి కనబరచడం లేదని స్పష్టం అవుతుంది. కేంద్ర, రాష్త్ర ప్రభుతాలు ఈ ప్రాజెక్ట్ విషయంలో దొంగాట ఆడుతున్నట్లు అర్థం అవుతుంది.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికంగా దేశంలోనే మొదటి స్థానంలోకి వచ్చే అవకాశం ఉండడంతో విభజన చట్టం ప్రకారం కేంద్రం పూర్తి చేయవలసిన ఈ ప్రాజెక్ట్ పట్ల మొదటి నుండి మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తుంది. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన భూసేకరణ సవరణ చట్టం కారణంగా ప్రాజెక్ట్ నిర్మాణవ్యయం గణనీయంగా పెరిగింది.

ఆ చట్టం మేరకు పెరిగిన నిర్మాణవ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని అంచనా వ్యయాన్ని సవరించామని టిడిపి హయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం చుట్టూ ఎన్ని ప్రదక్షణలు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పటికి కూడా కుంటిసాకులతో దానిని ఆమోదించడం లేదు. అన్ని రకాల కోతలు విధించి, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టు వరకు అంచనా వ్యయం రూ.35,490 కోట్లకు నిర్ధారించారు.

ఆ మొత్తం కూడా ఆమోదించి, విడుదల చేసి సత్వరం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేనుకు సహకరించడం లేదు. ఇప్పుడు తాజాగా డీపీఆర్‌ ఫైళ్లలో  వివరాలు కనిపించడం లేదని కేంద్రం చెప్పడం గమనిస్తే ఈ ప్రాజెక్ట్ ఇక కొండెక్కిన్నట్లు అనుకోవాల్సి ఉంటుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles