పార్లమెంట్  భవనంపై ఇరకాటంలో కేసీఆర్

Friday, April 19, 2024

పార్లమెంట్ నూతన భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే కార్యక్రమం విషయంలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యే విషయమై బహుశా మొత్తం దేశంలో ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోతున్న నేత, పార్టీ ఆయనే కావడం గమనార్హం.

మొత్తం 19 ప్రధాన ప్రతిపక్షాలు ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. మరోవంక, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వాములు కాకపోయినా, తమ తమ రాస్త్రాలలో బిజెపిని వ్యతిరేకిస్తున్నా బిజెపి, వైసిపి, టిడిపి, అకాలీదళ్ వంటి పక్షాలు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న ఆప్, టిఎంసి పక్షాలు సహితం ఈ విషయంలో కాంగ్రెస్ తో చేతులు కలిపాయి.

అయితే బిఆర్ఎస్ విధానాన్ని గురువారం నాడు ప్రకటిస్తామని పార్లమెంటరీ పార్టీ నేత డా. కేశవరావు బుధవారం చెప్పినా, ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కావడంతో ఈ కార్యక్రమానికి గైరాజరైతే బిఆర్ఎస్ – కాంగ్రెస్ రాష్ట్రంలో కొట్లాడుకున్నా ఢిల్లీలో ఒక్కటే అని బిజెపి ప్రచారం చేసేందుకు అవకాశం కల్పించినట్లవుతుంది.

పైగా, కాంగ్రెస్, బిజెపి వ్యతిరేక శక్తులతో జాతీయ స్థాయిలో రాజకీయాలు నడపాలి అనుకొంటున్న కేసీఆర్ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. కార్యక్రమానికి హాజరైతే, బిఆర్ఎస్-  బిజెపి పార్టీలు `ఢిల్లీలో  దోస్తీ- తెలంగాణాలో కుస్తీ’ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి బలం చేకూర్చిన్నట్లవుతుంది. అయితే, డిసెంబర్ 2020లో పార్లమెంట్ భవనంకు ప్రధాని శంకుస్థాపన చేస్తున్న సమయంలో కేసీఆర్ శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. ఆ సమయంలో ఆయన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో కొంతమేరకు సఖ్యతతో వ్యవహరిస్తున్నారు.

ఇలా ఉండగా, ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తే తెలంగాణాలో అధికారిక కార్యక్రమాలను గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ ను ఆహ్వానించని కేసీఆర్ ఢిల్లీలో సంగతుల గురించి మాట్లాడతారా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. తాజాగా, తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవంకు గవర్నర్ కు ఆహ్వానం పంపకపోవడం రాజకీయ వివాదాంశంగా మారింది.

స్వయంగా తనకు ఆహ్వానం అందలేదని గవర్నర్ ఆక్షేపణ తెలిపారు. ఆహ్వానం అందితే హాజరై ఉండేదానినని ఆమె చెప్పారు కూడా.  హైదరాబాద్ లో మహిళా గవర్నర్ ను ఆహ్వానించకుండా, ఢిల్లీలో మహిళా రాష్ట్రపతిని ఆహ్వానించాలని ఇతర ప్రతిపక్షాలతో కలిసి గళం విప్పితే రాష్ట్రంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుంది.

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళతెలంగాణ గవర్నర్ డా. తమిళిసై తెలంగాణ సచివాలయం అంశంతో ముడిపెడుతూ తన అక్కసును కేసీఆర్ ప్రభుత్వంపై వెళ్లగక్కారు.  తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని తమిళిసై మెచ్చుకుంటూనే సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తెలిపారు.

రాష్ట్రాన్ని పాలిస్తున్నది ముఖ్యమంత్రి అయినందున ఆయన చేతుల మీదుగానే సచివాలయం ప్రారంభోత్సవం జరిగిందని, గవర్నర్‌కు ఆహ్వానమే పంపలేదని అంటూ తమిళిసై ఎద్దేవా చేశారు. అదేవిధంగా, కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతుందని చెబుతూ పార్లమెంటును ప్రధాని మోదీ  కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. 

గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా?  అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు.  అయితే, ఆమె ఒక లాజిక్ ను ఇక్కడ మరిచిపోతున్నారు. గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. కానీ రాష్త్రపతిని దేశంలోని ఎంపీలు, ఎమ్యెల్యేలు అందరూ కలిసి ఎన్నుకొంటారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles