జగన్.. గంజాయి నీతులు చెప్పాల్సింది ఎవరికి?

Thursday, April 18, 2024

‘‘ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితమైన రాష్ట్రంగా తయారుచేయాలి. మూడు నాలుగు నెలల వ్యవధిలో ఈ లక్ష్యాన్ని అందుకోవాలి. గంజాయి అమ్మకాలు, అక్రమమద్యం వాటిని అరికట్టాలి. విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాలు లేకుండా.. జీరో నార్కొటిక్స్ చేయాలి..’’ చదువుతూ ఉంటే ఈ మాటలు చాలా చాలా తియ్యగా అనిపిస్తాయి. ఆహా.. మరో మూడు నాలుగు నెలల్లో మన రాష్ట్రం ఎలాంటి డ్రగ్స్ వినియోగమూ లేని.. స్వర్గధామంలాగా తయారైపోతుంది కదా.. అనే నమ్మకం కూడా కలుగుతుంది. అయితే ఇలాంటి నీతులను ఎవరికి చెబితే ఆ స్వప్నం సాకారం అవుతుంది. ఆ క్లారిటీ మాత్రం ముఖ్యమంత్రి జగన్ కు ఉన్నట్టుగా లేదు. 

ఎక్సైజ్, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి.. వారికి పైన చెప్పిన విధంగా ఆదర్శాలను వల్లించారు. కానీ కేవలం అధికారులకు నీతులు చెప్పినంత మాత్రాన ఏం జరుగుతుంది? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. 

గంజాయి సాగులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విచ్చలవిడిగా తయారైందనే ఆరోపణలు చాలా కాలంగా పుష్కలంగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏపీలో గంజాయి సాగు బాగా పెరిగిందని, తెలంగాణకు ఏపీనుంచి గంజాయి అక్రమ రవాణా కూడా విచ్చలవిడిగా పెరిగిందని తెలంగాణ పోలీసు అధికారులే వ్యాఖ్యానించిన వైనం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. గత మూడేళ్లలో గంజాయి సాగు విపరీతంగా పెరిగిందనే మాట వాస్తవం. అలాగే పొరుగురాష్ట్రాలనుంచి మద్యం అక్రమ రవాణా కూడా బాగా పెరిగిందనేది నిజం.మద్యం అక్రమరవాణా కేసులు దొరికిపోయినప్పుడెల్లా.. వాటి వెనుక వైసీపీ నాయకుల దందాలున్నాయని బయటపడింది. గంజాయి సాగు వెనుక కూడా వైసీపీ నాయకులు ఉండి నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాంటిది.. తమ సొంత పార్టీ వారికి నీతులు చెప్పకుండా, వారిని కట్టడి చేయకుండా.. కేవలం పోలీసులకు సుద్దులు చెప్పినంత మాత్రాన ఏమవుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు. 

ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గంజాయి సాగుచేస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలని కూడా జగన్ అధికార్లకు మార్గదర్శనం చేశారు. అయితే చేస్తున్న వారిని మారుస్తారు సరే.. వారితో ఆ సాగుచేయిస్తున్న పెద్దతలకాయల సంగతేమిటి? దందాలకు అలవాటు పడిన వారిలో పరివర్తన చేయడం సాధ్యమేనా? అనేది ప్రజల సందేహం. అక్రమాలకు పాల్పడుతున్న సొంత పార్టీ వారినందరినీ తెరవెనుకనుంచి కాపాడుకుంటూ వస్తూ.. పైకి పోలీసులకు డ్రగ్స్ అరికట్టాలనే నీతులు చెప్పినంత మాత్రాన రాష్ట్రంలో పరిస్థితులు మారవని, మాదకద్రవ్యాల అడ్డాగా రాష్ట్రం పరువు పోవడం గ్యారంటీ అని ప్రజలు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles