ఉదయం నుండి సీబీఐ ఛేజింగ్, చివరకు కర్నూల్ లో అవినాష్ రెడ్డి!

Friday, March 29, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, హైదరాబాద్ లోని ఇంటినుండి బయలుదేరి పులివెందులవైపు తిరగడంతో రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అవినాష్ రెడ్డి వ్యవహారంలో ఉదయం నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకోవడంతో ఎప్పుడేమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియని ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్తున్న క్రమంలో ఆయన తల్లి శ్రీలక్ష్మిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు  అంబులెన్సులో తరలిస్తున్నారు.

మార్గం మధ్యలో తాడేపల్లి వద్ద తన తల్లిని పరామర్శించిన అవినాష్ అదే అంబులెన్సులో బయలుదేరారు. కానీ అనూహ్యంగా అవినాష్ తన రూట్ ప్లాన్ ను మార్చారు.  హైదరాబాద్ కు కాకుండా కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో తన తల్లిని చేర్పించారు అవినాష్.

ఇక తాజాగా అవినాష్ రెడ్డి వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.  అవినాష్ రెడ్డికి ఛాతిలో నొప్పి తలెత్తడంతో ఆయన కూడా తల్లిని చేర్పించిన విశ్వభారతి ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం.
ప్రస్తుతం అవినాష్ కు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో అవినాష్ రెడ్డి విచారణలో సీబీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఉదయం నుండి రెండు ఇన్నోవా కార్లలో అవినాష్ రెడ్డిని వెంబడిస్తున్న సిబిఐ అధికారులు కర్నూల్ నుండి హైదరాబాద్ కు వెనుదిరిగారు. శనివారం ఉదయం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

వెంటబడిన సమయంలో సిబిఐ అధికారులు ఫోన్ చేస్తున్నా స్పందించక పోవడంతో సిబిఐ ఉన్నతాధికారులు ఢిల్లీలో ఆగ్రహం చెందారని, వెంటనే అరెస్ట్ చేయమని ఆదేశించారని అంటూ వార్తా కథనాలు వచ్చాయి.  దారిలో ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో అవినాష్ రెడ్డి మద్దతుదారులు గుమికూడుతూ ఉండడంతో సిబిఐ వాహనాలను అడ్డుకోవడానికా అనే అనుమానం కలిగింది.

హైదరాబాద్ లోని ఇంటి నుండి సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు ఉదయం బయలుదేరిన సమయంలో పులివెందులలోని తల్లి అనారోగ్యంతో కళ్ళుతిరిగి పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారని తెలియడంతో, విచారణకు హాజరు కాకుండా పులివెందుల బయలుదేరారు. తల్లికి అనారోగ్యం గురించి సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లాయర్లు సమాచారం ఇచ్చారు.

శుక్ర‌వారం కావ‌డంతో వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఉప‌వాస దీక్ష‌లు ఉన్నాయి.. ఉదయం నుంచి ఏమీ తీసుకోక‌పోవ‌డంతో అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో కళ్తు తిరిగి పడిపోవడంతో పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత ఆమెను మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలించాల‌ని వైద్య‌లు నిర్ణ‌యించడంతో హైదరాబాద్ కు బయలుదేరారని చెబుతున్నారు. .

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles