ఉత్తరాది వ్యాపారుల కుట్ర లిక్కర్ స్కాం … మాగుంట ఆగ్రహం

Thursday, April 18, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు మద్యం వ్యాపారులు, దళారులకే పరిమితమైన ఈడీ దర్యాప్తు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టుతో రాజకీయ నాయకులపై ఇప్పుడు దృష్టి సారింపనున్నట్లు వెల్లడయింది. 

విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలపడంతో రాజకీయ వివాదంగా కేంద్రంగా మారింది. ఈ రిపోర్ట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు, తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి కుమార్తె కవిత తమ పేర్లు పేర్కొనడం పట్ల ఎదురు దాడికి దిగడం గమనార్హం. 

వచ్చే  ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసమే బిజెపి వారు తన పేరును ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ `చేసుకొంటే అరెస్ట్ చేసుకోండి’ అంటూ ఓ విధంగా ఆమె సవాల్ విసిరారు. తద్వారా తనను అరెస్ట్ చేసే తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనే పరోక్ష హెచ్చరిక కూడా ఆమె చేశారు. 

మరోవంక, తనపై ఆరోపణలను మాగుంట శ్రీనివాసులు తీవ్రంగా కొట్టిపారవేస్తూ దక్షిణాది మద్యం వ్యాపారులపై ఢిల్లీ కేంద్రంగా గల ఉత్తరాది మద్యం వ్యాపారుల కుట్ర ఇదంతా అంటూ తీవ్రమైన ఆరోపణ చేయడం సరికొత్త రాజకీయ దుమారంకు దారితీసే విధంగా చేశారు. 

ఇప్పటికే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉత్తరాది,  ముఖ్యంగా గుజరాత్ వ్యాపారుల ప్రయోజనాలకోసం దక్షిణాది – ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు,  తమిళనాడు ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నదని అంటూ పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగుంట ఆరోపణలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. 

అరోరా రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితతో పాటుగా వైసీపీ ఎంపీ మాగుంట పేరు ప్రస్తావించారు. ఆప్ నేతలకు లిక్కర్ స్కాంలో భాగంగా వంద కోట్లు ముడుపులను అందించినట్లుగా పేర్కొన్న పేర్లలో మాగుంట గురించి వివరించారు. అదే విధంగా మాగుంట కుమారుడుకు రెండు రిటైల్ జోన్లు దక్కినట్లుగా వివరించారు. దీని పైన స్పందించిన ఎంపీ మాగుంట ఏం జరిగిందనేది స్పష్టత ఇచ్చారు.

లిక్కర్ స్కాంలో తన పేరు చేర్చడంతో ఆశ్చర్యపోయానని మాగుంఅం చేశారు.  గతంలో తాము మద్యం వ్యాపారాలు చేసిన మాట వాస్తవమేనని, అయితే, ఆ వ్యాపారాలను మానేసి చాలాకాలం అయిందని వివరించారు. ప్రస్తుతం వెలుగు చూసిన స్కాంలో అమిత్ అరోరా పాత్ర కీలకమని ఈడీ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. 

అయితే, అమిత్ అరోరా అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని మాగుంట తేల్చిచెప్పారు. అతనితో కనీసం తనకు ముఖ పరిచయం కూడా లేదన్నారు. తనకు, తన కుమారుడికి ఆ కంపెనీలో ఎలాంటి షేర్లు లేవని మాగుంట స్పష్టం చేశారు. గతంలోనే ఈ అంశంపై స్పష్టత ఇచ్చాని గుర్తు చేశారు.

ఇదంతా దక్షిణాది భారతీయులపై, ఉత్తరాది భారతీయులు చేస్తున్న `వ్యాపార కుట్ర’ అంటూ మండిపడ్డారు. వ్యాపార కుట్రలో భాగంగానే ఉత్తరాది భారతీయులు ఇదంతా చేశారని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలపై త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. తనకే కాదని..తన కుమారుడికి ఈ వ్యవహారంలో ఎటువంటి ప్రత్యక్ష – పరోక్ష పాత్ర లేదని మాగుంట తేల్చి చెప్పారు. 

డిల్లీ లిక్కర్ స్కాం పై విచారణ ప్రారంభమైన సమయం నుంచి మాగుంట పేరు వినిపిస్తోంది. ఢిల్లీ, నెల్లూరు, చెన్నైలోని ఆయన కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేసారు. అయితే, సోదాలు జరిగినా  ఎటువంటి అక్రమాలు గుర్తించలేదని మాగుంట వివరించారు. తమ కుటుంబం 70 ఏళ్లుగా లిక్కర్ వ్యాపారంలో ఉందని గుర్తు చేశారు. తమ ఇంటి పేరుతోనే మరి కొంత మంది ఇదే వ్యాపారంలో ఉన్నారని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 గత సెప్టెంబర్ లో తన సంస్థల్లో సోదాల సమయంలోనూ మాగుంట ఈ అంశాలను చెప్పుకొచ్చారు. తమ సంస్థల్లో ఎటువంటి అక్రమాలు గుర్తించలేదనే విషయాన్ని సోదాల తరువాత ఈడీ అధికారులు వెల్లడించారని వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles