ఆ సొమ్ములు రాగానే.. మైండ్ గేమ్ మొదలెట్టారు!

Friday, April 19, 2024

రాజకీయ పార్టీలు ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నాలు, ఆలోచనలకంటె.. తమ తమ రాజకీయ ప్రత్యర్థులను మైండ్ గేమ్ తో గెలవడం మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తమ ప్రత్యర్థి పార్టీ కాన్ఫిడెన్సు కోల్పోయేలా… వారి బలాల గురించి వారిలోనే అనుమానాలు పుట్టించేలా, వారి విశ్వసనీయత గురించి ప్రజల్లో అనుమానాలు పుట్టించేలా ప్రవర్తించడమే ఇవాళ్టి రాజకీయ పార్టీల ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నారు.
కేంద్రప్రభుత్వం రాష్ట్ర సర్కారుకు పదివేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. ఇది కేవలం రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీ సర్కారు నిధులు ఇవ్వడం మాత్రమే. కానీ.. జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాల వల్ల మాత్రమే ఢిల్లీ సర్కారు ఈ నిధులు ఇచ్చిందని వైసీపీ దళాలు ఒక ప్రచారం ప్రారంభించాయి. దీని అర్థం- బీజేపీ , తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని కూడా రంగు పులుముతున్నాయి. ఈ పదివేల కోట్లు రావడంతో.. బిజెపితో పొత్తు ఇక ఉండబోదని తెలుగుదేశం శ్రేణులంతా నిరాశలో కూరుకుపోయినట్లు కూడా చాటుతున్నాయి. కానీ, పదివేల కోట్లు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తప్ప జగన్ సర్కారుకు కాదని మర్చిపోతున్నాయి.
ఒకవైపు , జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని, తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి మాత్రమే పోటీచేస్తాయని పవన్ కల్యాణ్ చాలా విస్పష్టంగా ప్రకటించారు. బిజెపి శ్రేణులు కూడా ఇలాంటి పొత్తులకోసం నిరీక్షిస్తున్నాయి. అయితే బిజెపి అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పష్టమైన సంకేతాలు కూడా ఇప్పటిదాకా పొత్తుల విషయంలో రాలేదు.
ఇలాంటి సమయంలో కేంద్రంనుంచి రాష్ట్రానికి నిధులు రావడంతో.. వైసీపీ దళాలు మైండ్ గేమ్ ప్రారంభించాయి. బిజెపి వారిని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. కేంద్రం నిధులు ఇవ్వడం వెనుక పరమార్థం.. తెలుగుదేశంతో పొత్తులు ఉండబోవనడానికి నిదర్శనం అంటున్నాయి. అయితే.. ఇవి చంద్రబాబునాయుడు పాలన కాలం నాటి బకాయిలు అని, వాటికోసం నాలుగేళ్ల పాటు ఆయన ఢిల్లీ సర్కారును ఫాలో అప్ చేస్తే అవి ఇప్పటికి మంజూరయ్యాయని వారు మర్చిపోతున్నారు. అదే సమయంలో.. జగన్ తాను గద్దె ఎక్కిన తర్వాత.. ఢిల్లీ సర్కారు నుంచి ఏం రాబట్టారో కూడా చెప్పలేకపోతున్నాయి. ఇలా కాసిని నిధులు రాగానే మైండ్ గేమ్ ప్రారంభించకుండా, ఏ ప్రత్యేకహోదా లాంటిదో రాష్ట్రం కోసం సాధిస్తే.. అప్పుడు కేంద్రం జగన్ పట్ల చాలా సానుకూల వైఖరితో ఉన్నదని వైసీపీ వారు టముకు వేసుకోవచ్చు. అలాకాకుండా ఇలాంటి మైండ్ గేమ్ తో వారే అభాసుపాలవుతారని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles