అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ సిద్ధం!

Friday, April 19, 2024

తెలంగాణ వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ కుమ్ములాటలతో సతమతమవుతోంది. అనేక నియోజకవర్గాలలో మంత్రులు, పార్టీ ఎమ్యెల్యేలకు వ్యతిరేకంగా స్థానికంగా బలమైన నాయకులు వీలుచిక్కినప్పుడల్లా తమ అసమ్మతిని వినిపిస్తూనే ఉన్నారు. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్యెల్యేలకు తిరిగి సీట్ ఇస్తే పార్టీ వచ్చే ఎన్నికలలో మరోసారి గెలుపొందడం దుర్లభమని పార్టీ నాయకత్వానికి స్పష్టం చేస్తూనే ఉన్నారు.

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బయటపడిన `ఎమ్యెల్యేల కొనుగోలు’ కేసు సందర్భంగా పార్టీలో చాలామంది ఎమ్యెల్యేలు తీవ్ర అసమ్మతతో ఉన్నారని, ఎన్నికల ముందు పార్టీ మారడానికి సహితం సిద్ధంగా ఉన్నారనే సంకేతం వెలువడింది. అయితే వారి ప్రయత్నానికి అప్పుడు అడ్డుకట్ట వేయడం ద్వారా బిజెపి ఎత్తుగడలను భగ్నం చేయడం కోసం వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్యెల్యేలు అందరికి సీట్లు ఇచ్చి, తాను గెలిపించుకొంటా అని కేసీఆర్ బహిరంగంగా భరోసా ఇచ్చారు.

పైగా, ఎమ్యెల్యేల సమావేశంలో కూడా ఈ విషయం ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత పలు నియోజకవర్గాల్లో ఎమ్యెల్యే వ్యతిరేక వర్గాలు మరింత క్రియాశీలంగా మారడం కనిపిస్తున్నది. వారికి సీట్ తిరిగి ఇస్తే తాము పార్టీ మారతామనే సంకేతాలు పంపుతూ వస్తున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేసీఆర్ పలువురు ఎమ్యెల్యేలకు తిరిగి సీటు ఇవ్వడానికి విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇటువంటి సమయంలో సీఎం కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఉందని ఉందని,కానీ పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉందని అంటూ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన సంచలన ప్రకటన బిఆర్ఎస్ ఎమ్యెల్యేలలో ప్రకంపనలు సృష్టిస్తున్న ది.  ఆ ఎమ్మెల్యేలను మారిస్తేనే బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని.. లేదంటే 90 సీట్లకే పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు. తన సర్వే ఎప్పుడూ తప్పు కాలేదని ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

కేసీఆర్ అనుమతి లేకుండా ఎర్రబెల్లి ఇటువంటి ప్రకటన చేసే అవకాశం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అంటే సుమారు 25 మంది ఎమ్యెల్యేలకు తిరిగి సీట్లు ఇవ్వరాదని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకనే ముందుగా ఈ విధంగా సంకేతాలు పంపారని చెప్పుకొంటున్నారు. కొన్నిసీట్లలో పక్షాలతో పొత్తుల పేరుతో సిట్టింగ్ లకు సీట్లు ఎగగొట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తున్నది.

సాధారణంగా ఓ మంత్రి ఏకంగా 25 మంది ఎమ్యెల్యేల పనితీరు సరిగ్గాలేదని బహిరంగంగా చెప్పే పరిస్థితి ఏ పార్టీలో కూడా ఉండదు. పైగా, బిఆర్ఎస్ వంటి పార్టీలో ఎవ్వరు అటువంటి సాహసం చేయరు. ఒకవేళ సొంతంగా అటువంటి సర్వే జరిపినా, సీఎం కేసీఆర్ కు సర్వే వివరాలు అందిస్తారు గాని తానే బహిరంగంగా వెల్లడి చేసే అవకాశం ఉండదు. అందుకని, అది స్వయంగా కేసీఆర్ చేయించిన సర్వే అయి ఉండేవకాశం ఉంటుందని స్పష్టం అవుతుంది.

కాగా, అసమ్మతి ఉందన్న చెబుతున్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల లిస్టును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బయటపెట్టాలని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ సవాలు విసిరారు. 20 నుంచి 30 మంది ఎంఎల్‌ఎల పేర్లు బయటపెడితే ప్రజల వారిని ఎన్నుకోవాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఆ విధమైన ప్రకటన ఇప్పుడే చేస్తే అధికార పార్టీలో పెద్ద ఎత్తున తిరుగుబాటుకు అవకాశం ఉంటుందనే సంకేతం ఇచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles