అప్పుల కోసం ప్రధానికి   చంద్రబాబు పాలనపై జగన్ ఫిర్యాదు!

Friday, April 19, 2024

అర్జెంటుగా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించిన వినతి పత్రాలలో కొత్త అంశాలను ఏవీ లేవు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి అందిస్తున్న వినతిపత్రాలలో పేర్కొంటున్న పోలవరం, రాష్ట్ర విభజన హామీల అమలు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. 

అయినా వీటిపై కేంద్రం పట్టించుకోక పోవడం, తగు రీతిలో స్పందించక పోవడం గురించి ప్రధానిని ఏనాడూ నిలదీసే  ప్రయత్నం చేయలేదు. అత్యవసరంగా ఇప్పుడు ప్రధానిని కలవడం గమనిస్తే రోజువారీ ఖర్చుల కోసం కూడా ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోమని అభ్యర్హ్దించడం కోసమే అని స్పష్టం అవుతుంది. 

అప్పులు కూడా పుట్టని పరిస్థితులు నెలకొనడంతో, ప్రధాని జోక్యం చేసుకొని రాష్ట్రానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ రుణపరిమితిని పెంచేటట్లు చేయమని ఆయన కోరినట్లు సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.  ఏపీకి కొత్త అప్పులు ఇవ్వడం సాధ్యంకాదని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి తేటతెల్లం చేసిన నేపథ్యంలో  ఈసారి నేరుగా ప్రధానికే సీఎం అప్పులపై అభ్యర్థించినట్లు తెలుస్తున్నది.

అయితే, ఈ సందర్భంగా ప్రధాని దృష్టి ఆకట్టుకోవడానికో ఏమిటో,  పనిలోపనిగా గతంలోని చంద్రబాబు నాయుడు పాలనపై ఫిర్యాదులు చేశారు.  ప్రస్తుతం తమ ప్రభుత్వం అప్పుల ఊబిలో ఇరుక్కుని పోవడానికి తన పాలనా నిర్వాకం కాదని, గతంలోని టిడిపి పాలన అంటూ ప్రధానికి చెప్పారు.   

గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను తమ  ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోవాల్సిన రుణాలపై పరిమితి విధిస్తోందని ప్రధానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ వారు చేసిన పనుల కారణంగానే ప్రస్తుతం కేంద్రం తమపై రుణపరిమితి ఆంక్షలు విధిస్తున్నదని చెప్పుకొచ్చారు.

పైగా, కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోందని అంటూ తమ ప్రభుత్వంపు ఆర్ధిక అక్రమాలపై కేంద్ర ఆర్ధిక శాఖ స్పందనపై ఆవేదన వ్యక్తం చేసిన్నట్లున్నారు. టిడిపి ప్రభుత్వం చేసిన తప్పులకు తమ ప్రభుత్వం శిక్ష అనుభవిస్తోందని అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేశారు.  అయితే, జగన్ అభ్యర్థనపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు గాని, ఈ విషయంలో జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటానని గాని హామీ ఇచ్చినట్లు మాత్రం చెప్పడం లేదు. 

 ‘‘గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను ఇప్పుడు సర్దుబాటు చేస్తూ కొత్త రుణాలపై పరిమితి విధిస్తున్నారు. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తున్నారు’’ అని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారని మాత్రమే సీఎం కార్యాలయం జారీచేసిన ప్రకటన తెలిపింది. 

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2937.92 కోట్లను వెంటనే చెల్లించాలని ప్రధానమంత్రిని జగన్‌ కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశంకూడా ఇంకా పెండింగులోనే ఉందని…. గతంలో చంద్రబాబు హయాంలో సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన రూ.55,548 కోట్లనే మంజూరు చేయాలని అభ్యర్థించారు.

ఈ బకాయిలను వెంటనే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ   పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశం కూడా ఇంకా పెండింగులోనే ఉందని గుర్తు చేశారు. ఈ రెండు అంశాలపై రెండేళ్లుగా ప్రధానికి జగన్ విజ్ఞప్తులు చేస్తుండటం, ఆయన తలూపడం జారుతూనే ఉంది గాని, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే, ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీయలేక పోతున్నారు అన్నమాట. 
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదిన్నరేళ్ళు అవుతున్నా విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రధానికి ఎప్పటి మాదిరిగా మరోమారు తెలిపారు.   

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles