అన్ని పార్టీల్లోనూ కేసీఆర్  కోవర్టుల అంటూ బిజెపిపై ఈటెల దాడి!

Tuesday, April 16, 2024

సీఎం కేసీఆర్‌కు సంబంధించిన వ్యక్తులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారంటూ మాజీ మంత్రి, బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలు బిజెపి నాయకత్వంపై ఆయనలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా పలువురు భావిస్తున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో నం 2గా ఉంటూ, టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్ కు సన్నిహితంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఈటెల రాష్ట్ర మంత్రివర్గంలో ఆర్ధికం, ఆరోగ్యం వంటి కీలక శాఖలు నిర్వహించారు.

అయితే కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేందుకు అడ్డుపడే అవకాశం ఉందని కేసీఆర్ తనను పక్కకు నెత్తిన సమయంలో బిజెపి అగ్రనాయకత్వం అనేక హామీలు ఇచ్చి పార్టీలో చేర్చుకోంది. కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా హుజురాబాద్ ఉపఎన్నికలలో తన సామర్ధ్యంతో గెలుపొంది తెలంగాణాలో బీజేపీలో నూతన ఉత్తేజం తీసుకువచ్చారు. అప్పటి నుండి తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని భరోసా బిజెపి నాయకత్వంలో ఏర్పడుతూ వచ్చింది.

అయితే, బీజేపీలో చేరినప్పటి నుండి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నుండి ప్రజలతో సంబంధం లేని ప్రముఖ నాయకులు అందరూ ఈటెల ఉనికి తమ రాజకీయ భవిష్యత్ కు పెనుముప్పుగా భావిస్తూ నిరాదరణకు, అవమానాలకు గురి చేస్తూ వస్తున్నారు. తెలంగాణాలో బిజెపి అధికారంలోకి రావాలంటే ఈటెలను రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా చేయాలని పార్టీ అగ్రనాయకత్వంలో ఆలోచనలు వచ్చినప్పటి నుండి ఈటెలకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు.

హుజురాబాద్ లో ఈటెలను ఓడించడం కోసం కొందరు బిజెపి నేతలు తీవ్ర ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా మణుగూరులో సహితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమికి కొందరు బీజేపీ నేతలే స్కెచ్ వేశారని కూడా చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున పట్టుబడిన బిజెపికి చెందిన నగదు అంతా బిజెపికి చెందిన వారే పోలీసులకు ఏకారులో, ఎంత మొత్తం వస్తుందో పక్క సమాచారం ఇవ్వడంతోనే సాధ్యమైన్నట్లు స్పష్టం అవుతున్నది.

అందుకనే ప్రతి పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఈటెల చేసిన ఆరోపణ కొందరు బిజెపి నాయకులను ఉద్దేశించే అని చాలామంది భావిస్తున్నారు. కొందరు బీజేపీలో కీలక పదవులలో ఉన్న నేతలు సహితం కేసీఆర్ తో పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారన్నది బహిరంగ రహస్యమే.

కేసీఆర్ కు సన్నిహితులుగా భావిస్తున్న ప్రముఖ కాంట్రాక్టుదారులు, రియల్ ఎస్టేట్ యజమానులతో పలువురు ప్రముఖ బిజెపి నేతలకు ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయన్న విషయం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు కూడా చేరినట్లు తెలుస్తున్నది.

దేశంలో మరే పార్టీలో లేనివిధంగా తెలంగాణాలో బిజెపి ఈటెల అధ్యక్షునిగా ఇతర పార్టీల వారిని ఆకర్షించడం కోసం `చేరికల కమిటీ’ని వేశారు. అయితే పలువురు బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను బిజెపిలోకి చేర్చుకునేందుకు ఈటెల ప్రయత్నాలు చేస్తున్నా ఆ సమాచారాన్ని కొందరు బీజేపీ వారే ప్రత్యర్థి పార్టీల నాయకులకు అందిస్తూ ఉండడంతో, ఆయా పార్టీల నాయకత్వం అప్రమత్తం అవుతున్నట్లు తెలుస్తున్నది.

అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఈటెల కేంద్ర నాయకత్వంకు స్పష్టం చేశారు. బిజెపి జాతీయ నాయకత్వాన్ని అప్రదిష్ఠకు గురిచేసి, ఇరకాటంలో పెట్టిన `ఎమ్యెల్యేల కొనుగోలు’ వ్యవహారంలో సహితం బీజేపీలోని కేసీఆర్ కోవర్టులు సహకారంతోనే జరిగినట్లు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles